📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఅర్ధరాత్రి పాము కాటు.. మహిళ మృతి

అర్ధరాత్రి పాము కాటు.. మహిళ మృతి

📰 Generate e-Paper Clip

అర్ధరాత్రి పాము కాటు.. మహిళ మృతి

  • జనగాం గ్రామ శివారులో విషాద ఘటన
  • తాండూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పరిస్థితి విషమం
  • వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు నిర్ధారణ

పెద్దేముల్, ఆగస్టు 23 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం జనగాం గ్రామ శివారులో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.జనగాం గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో కాపలాదారులుగా, కూలీలుగా పనిచేస్తున్న దంపతుల కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది.మృతురాలిని నర్సమ్మగా గుర్తించారు.ఆమె భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్ధరాత్రి పాము కాటు

పోలీసుల వివరాల ప్రకారం.. ఆంజనేయులు తన భార్య నర్సమ్మ, పిల్లలతో కలిసి సుమారు నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం జనగాం గ్రామానికి వచ్చారు.అప్పటి నుంచి గ్రామ శివారులో హైదరాబాద్‌కు చెందిన మైనోద్దీన్ కు చెందిన ఫామ్‌హౌస్‌లో కాపలాదారులుగా, లేబర్లుగా పనిచేస్తూ అక్కడే ఉన్న లేబర్ రూమ్‌లో నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలో ఆగస్టు 23న రాత్రి కుటుంబ సభ్యులు లేబర్ రూమ్‌లో నిద్రిస్తుండగా, అర్థరాత్రి సుమారు 2 గంటల సమయంలో నర్సమ్మను గుర్తుతెలియని పాము కాటువేసినట్లు పోలీసులు తెలిపారు. పాము కాటుతో తీవ్ర నొప్పికి గురైన ఆమె కేకలు వేస్తూ ఏడవడంతో భర్త ఆంజనేయులు అప్రమత్తమయ్యారు.

తాండూరు ఆసుపత్రికి తరలింపు

వెంటనే ఆంజనేయులు, పక్క పొలంలో నివసించే బ్యాగరి అనంతప్ప సహాయంతో నర్సమ్మను ఆటోలో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పాముకాటుకు చికిత్స అందించి స్నేక్ బైట్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.

హైదరాబాద్‌కు తరలిస్తుండగా

అంబులెన్స్‌లో నర్సమ్మను హైదరాబాద్‌కు తరలిస్తుండగా వికారాబాద్ సమీపంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆంజనేయులు ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

అనుమానం లేదన్న భర్త ఆంజనేయులు

తన భార్య నర్సమ్మ పాముకాటుతోనే మృతి చెందినట్లు ఆంజనేయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె మృతిపై ఎవరి పైనా తనకు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు.

కేసు నమోదు.. దర్యాప్తు

ఈ ఘటనపై ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు ఘటనపై చట్టప్రకారం తదుపరి దర్యాప్తు చేపట్టారు. నర్సమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular