కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి
బూర్గంపాడు ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):మపేద ఆడబిడ్డల వివాహాలకు భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నేతృత్వంలో సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని కోరారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందించాలని డిమాండ్ చేశారు.పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ పథకాలను కొనసాగిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

