ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
– పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్,పంచాయతీ కార్యదర్శి లాలప్ప
పెద్దేముల్, జూలై 31(ప్రజాక్షేత్రం):ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప లు అన్నారు.శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గ్రామసభలో గ్రామస్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, గ్రామంలో పలుచోట్ల ఉన్న విద్యుత్ ఇనుప స్తంభాలకు షాక్ వస్తోందని, హరిజనవాడలో అంగన్వాడీ భవనం లేక చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీపంలోని చౌరస్తాకు “సీపీఆర్ సర్కిల్”గా పేరు పెట్టాలని కాలనీవాసులు కోరారు.అదేవిధంగా విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్లో శుక్రవారం ఉదయం ఓ వినియోగదారునికి పెట్రోల్లో నీరు కలిసివచ్చిందని గ్రామసభలో ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టామని సర్పంచ్ తెలిపారు.
జీపీడీపీ (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక)లో భాగంగా గ్రామంలోని వివిధ లైన్ డిపార్ట్మెంట్లకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమకూర్చుకునే ప్రణాళికలపై గ్రామ ప్రజలతో చర్చించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప లు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాల సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు.తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీప చౌరస్తాకు “సీపీఆర్ సర్కిల్”గా పేరు మార్చే అంశాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తామని వెల్లడించారు.జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, బోర్ రీచార్జ్ ఇంజెక్షన్లు, చెక్డ్యామ్లు, ఫామ్ ఫండ్స్ , కమ్యూనిటీ సోక్ పిట్స్, మ్యాజిక్ సోక్ పిట్స్ ల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపడతామని తెలిపారు.ఈ గ్రామసభలో వార్డు సభ్యులు మంబాపురం ఆంజనేయులు, ఎండి.నయీమ్, వెంకటకృష్ణ, రొంపల్లి మల్లప్ప, నర్సమ్మ, మైసమ్మ, జయారెడ్డి, లక్ష్మణ్, రవికుమార్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప, జీపీఓ బిచ్చమ్మ, కారోబార్ నర్సిరెడ్డి,ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీ, విజయలక్ష్మి, రేణుక, ఆశా వర్కర్లు మల్లీశ్వరి, అనూష, పుష్ప, ఐకేపీ సీసీ లక్ష్మణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

