భాగ్యనగరంలో కుండపోత వాన..
– జలమయమైన రహదారులు.. స్తంభించిన ట్రాఫిక్!
హైదరాబాద్ జూన్ 18(ప్రజాక్షేత్రం):భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విస్తారంగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్సిటీలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లలో వాన కొడుతుంది. అలాగే సైదాబాద్, సంతోష్నగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, మన్సూరాబాద్ తదితర పరిసర ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లోనూ ఈ వాన ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే జనం నరకయాతన పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.

