చెత్త బండి వస్తున్నా.. రోడ్లపైనే చెత్త
- చెత్త కుప్పలతో శంకర్పల్లి సతమతం
- ప్రజల నిర్లక్ష్యంతో అపరిశుభ్రంగా మారుతున్న వీధులు
శంకర్పల్లి, ఆగస్టు 02(ప్రజాక్షేత్రం):పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన లోపం శంకర్పల్లి పట్టణానికి సమస్యగా మారుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నప్పటికీ కొందరు ఇళ్లలోని చెత్తను రోడ్ల పక్కన పడేస్తుండటంతో పట్టణంలోని పలు ప్రాంతాలు చెత్త కుప్పలుగా మారుతున్నాయి.
సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా…
సాయంత్రం 7 గంటలు దాటితే పలు కాలనీలు, వీధుల్లో చెత్త సంచులు దర్శనమిస్తున్నాయి. ఇంటి ముందుకు చెత్త బండి వచ్చినా అందులో వేయకుండా కొందరు ప్లాస్టిక్ సంచుల్లో కట్టి రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. దీంతో ఉదయానికి వీధి కుక్కలు చెత్తను చింపివేయడంతో రహదారులపై చెత్త పేరుకుపోతోంది.
డ్రైనేజీలకు అడ్డంకిగా ప్లాస్టిక్ వ్యర్థాలు
వర్షాకాలంలో చెత్తలోని ప్లాస్టిక్ సంచులు డ్రైనేజీల్లోకి చేరి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో మురుగు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద పెరగడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులకు ఇబ్బందులు
చెత్త కుప్పల సమీపంలోని వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన కారణంగా వినియోగదారులు దుకాణాల వద్ద ఎక్కువసేపు ఉండటం లేదని వాపోతున్నారు.
ఫిర్యాదులు చేస్తూనే.. నిర్లక్ష్యం
మున్సిపల్ అధికారులు చెత్త తొలగించడం లేదని కొందరు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ, మరోవైపు తమ ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత పెరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రజల సహకారం అవసరం
శంకర్పల్లిని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు. చెత్తను మున్సిపల్ చెత్త బండికే అందజేయాలని, రోడ్లపై చెత్త వేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



