తెలంగాణలో భానుడి విశ్వరూపం
- అత్యధికంగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు
- తెలంగాణలో అధికంగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ఎండ ప్రభావానికి తీవ్రమైన వేడి, ఉక్కపోత
- మరో రెండ్రోజులు ఎండల తీవ్రత పేరిగే అవకాశం
- ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మధ్యాహ్నాం 12:30 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ 43.8, నిజామాబాద్ 42.7, మహాబూబ్నగర్ 42, రామగుండం 42 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధిక ఉష్ణోగ్రతలతో వర్షాలు
శుక్రవారం, ఎల్లుండి ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. దిగువస్థాయి గాలుల్లో మార్పు, క్యూములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావాలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
19న ఉరుములు మెరుపులతో వర్షాలు
ఈ నెల 19న జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 20న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.

