ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం…
- 12ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం
ఖమ్మం జూన్ 11(ప్రజాక్షేత్రం):ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేసే వ్యక్తి మనుమరాలు (12)పై అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా, బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్లోని మహిళకు చెప్పగా, బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. కాగా ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో, తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చి, బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా, ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌస్పై ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

