కాడెద్దులా మారిన కన్నతల్లి..
- భుజంపై నాగలి మోస్తూ సాగు చేస్తున్న మహిళా రైతు…
- కంటతడి పెట్టిస్తున్న రైతు కష్టం!
మహారాష్ట్ర జూన్ 11(ప్రజాక్షేత్రం):ఆకలి తీర్చే అన్నదాత బతుకుచిత్రమిది. గుండెలు పిండేసే కన్నీటి గాథ ఇది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద రైతు కుటుంబానికి ప్రకృతి కూడా కరుణించలేదు. ఉన్న ఒక్క ఎద్దు పిడుగుపాటుకు చనిపోవడంతో, సాగు ఆగిపోతే ఆకలితో అలమటించాల్సి వస్తుందని.. ఆ తల్లి తానే కాడెద్దుగా మారింది. భుజంపై నాగలి మోస్తూ, కన్నీళ్లను దిగమింగుతూ భర్తతో కలిసి పొలం దున్నుతున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.గుండె పగిలే విషాదం.. ఆగని సాగు తపనమహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామానికి చెందిన ఒక పేద రైతు కుటుంబం ఉన్న కొద్దిపాటి భూమినే నమ్ముకుని జీవిస్తోంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పిడుగుపడి, వారి వ్యవసాయానికి ఆధారమైన ఒక ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంకొక ఎద్దును కొనే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. అలాగని సాగు ఆపేస్తే ఆ సంవత్సరం మొత్తం పస్తులుండక తప్పదు. అందుకే, ఆ ఇల్లాలు తన బాధను గుండెల్లో దాచుకుని, భర్తకు అండగా నిలబడింది. ఎద్దు స్థానంలో తనే నిలబడి కాడిని భుజాన వేసుకుంది.

