బండి భగీరథ్కు కోర్టు మధ్యంతర బెయిల్!
- పరీక్షలు రాసుకునేందుకు మల్కాజ్గిరి కోర్టు అనుమతి
- ఈ నెల 26 వరకు లభించిన తాత్కాలిక ఊరట.. మళ్లీ జైలుకు!
హైదరాబాద్ జూన్ 20(ప్రజాక్షేత్రం):తెలంగాణలో గత నెల రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన కాలేజీ చివరి సెమిస్టర్ పరీక్షలు హాజరయ్యేందుకు వీలుగా న్యాయస్థానం ఈ తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
కేసు నేపథ్యం – ప్రస్తుత పరిస్థితి
ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారన తీవ్రమైన ఆరోపణలపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతనెల మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మే 16న సైబరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్లో ఉన్న భగీరథ్కు.. నేడు జూన్ 20 నుంచి జూన్ 26 వరకు పరీక్షల నిమిత్తం కోర్టు బెయిల్ ఇచ్చింది. పరీక్షలు ముగిసిన వెంటనే, జూన్ 25 లేదా 26న ఆయన తిరిగి కోర్టు ముందు హాజరై జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సైబరాబాద్ సీనియర్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరిందని, త్వరలోనే చార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.

