-ఆర్లి (కే) వంతెన మరమ్మతులకు గ్రామస్తుల విజ్ఞప్తి
నిర్మల్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):లోకేశ్వరం మండలంలోని ఆర్లి (కే) గ్రామ సమీపంలోని వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడటంతో పాటు నిర్మాణం బలహీనపడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే వంతెన మరింత దెబ్బతిని ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. వంతెన పరిస్థితిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న ఈ వంతెనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

