
గిద్దలూరు, జులై 14(ప్రజాక్షేత్రం): నంద్యాల–గిద్దలూరు ప్రధాన రహదారిలోని శ్రీ సర్వ నరసింహస్వామి క్షేత్రం–పచ్చర్ల గ్రామం మధ్య నల్లమల అరణ్య ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.నంద్యాల వైపు నుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న టిప్పర్, మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నంద్యాల వైపు వస్తుండగా కల్వర్టు వద్ద ఎదురుపడ్డాయి. బస్సును తప్పించే ప్రయత్నంలో టిప్పర్ అదుపు తప్పి ముందుగా కల్వర్టును ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో టిప్పర్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. బస్సులోని సుమారు 60 మంది ప్రయాణికులు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనతో కొంతసేపు ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

