విధి నిర్వహణపై వివాదం.. పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు
- విధి నిర్వహణపై మాటామాటా.. ఉద్రిక్తత
- పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు
- కుర్చీతో దాడికి ప్రయత్నించారని ఆరోపణ
- అధికారుల సమక్షంలోనే ఘటన
- ఎంపీడీఓ, ఎంపీఓలే ప్రత్యక్ష సాక్షులంటూ వెల్లడి
- తనను దూషించి బెదిరించారని కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్ ఆరోపణ
- కుర్చీతో దాడికి ప్రయత్నించారని ఆరోపణ.. సమగ్ర విచారణకు డిమాండ్
పెద్దేముల్, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):విధి నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో తనను పంచాయతీ కార్యదర్శి మల్లేష్ దూషించి,కుర్చీతో దాడి చేసేందుకు ప్రయత్నించారని కందనెల్లి తాండ గ్రామ సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్ ఆరోపించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి తనకు న్యాయం చేయాలని కోరుతూ పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామికి శనివారం వినతిపత్రం సమర్పించారు.
సర్పంచ్ ఆనంద్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14న సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయంలో వీసీ సమావేశం అనంతరం తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.నవిత కందనెల్లి తండా గ్రామంలో విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఎంపీడీఓ,ఎంపీఓలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం తమ గ్రామపంచాయతీ కార్యదర్శి కే.నవిత వేరే గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ను అక్కడికి పిలిపించగా, ఆయన తనను దుర్భాషలాడుతూ కుర్చీతో దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆనంద్ నాయక్ ఆరోపించారు.కార్యాలయంలో అధికారుల సమక్షంలోనే తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.అక్కడే ఉన్న ఎంపీడీఓ, ఎంపీఓలు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటన జరుగుతున్న సమయంలో కార్యాలయం బయట ఉన్న తన కుమారుడు రాథోడ్ నితీష్ నాయక్ అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినట్లు సర్పంచ్ ఆనంద్ నాయక్ తెలిపారు.అనంతరం ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.ఘటనకు సంబంధించి ఇరువర్గాల వాదనలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని ఆనంద్ నాయక్ కోరారు.అధికారుల సమక్షంలోనే ఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఎంపీడీఓను విజ్ఞప్తి చేశారు.
తనపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడి, దూషణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్ డిమాండ్ చేశారు.

