సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
హైదరాబాద్ ఆగస్టు 24(ప్రజాక్షేత్రం):తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిఎసి) భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు మరియు రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22 ఏ జీవో అమలు పై సభలో నిలదీసేందుకు విపక్షాలు కార్యాచరణ రచిస్తున్నాయి. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు, మాటల యుద్ధం జరిగే అవకాశముండటంతో ఈ సమావేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

