మాటల నాయకుడు కాదు…చేతల నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- ప్రతి రోజు ప్రజల మధ్య ఉంటూ తాండూరును మారుస్తున్న ఎమ్మెల్యే బీఎంఆర్
- చెల్లని హామీలు కాదు..చేతల్లో తాండూరు అభివృద్ధి
- రూ.289 కోట్లతో రహదారుల విప్లవం
- బైపాస్ పనులకు తొలగిన అడ్డంకులు
- భూ బాధితులకు రూ.25.13 కోట్ల పరిహారం
- కోట్ పల్లి ప్రాజెక్టుకు కొత్త జీవం..9,200 ఎకరాలకు సాగు నీటి ఆశలు
- ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలే లక్ష్యం
- మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
పెద్దేముల్ , ఆగస్టు 04 (ప్రజా క్షేత్రం )
ప్రజాప్రతినిధి అంటే ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుడు కాదని, ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించే నాయకుడేనని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) తన పనితీరుతో నిరూపిస్తున్నారు.తాండూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతూ రోడ్లు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రజల్లోనే ఉంటూ… ప్రజల కోసమే పరితపన
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వారంలో నాలుగు రోజులు తాండూరులోనే మకాం వేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.గ్రామాల నుంచి పట్టణం వరకు అభివృద్ధి సమానంగా జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
రోడ్ల అభివృద్ధికి భారీ నిధుల సమీకరణ
నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారు.హ్యామ్ (HAM) విధానం ద్వారా సుమారు రూ.289 కోట్ల నిధులు మంజూరు చేయించగా,అందులో పెద్దేముల్ మండలానికే రూ.185 కోట్లు కేటాయించడం విశేషం.బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో కూడా కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణాలు, మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి.
తాండూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి
తాండూరు పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.210 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు వంటి అనేక పనులు ఇప్పటికే ప్రారంభమవగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో తాండూరు పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు.
దశాబ్దాల కలకు బైపాస్ రూపం
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. భూసేకరణ సమస్యలను పరిష్కరించి 140 మంది భూ బాధితులకు రూ.25.13 కోట్ల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నిలిచిపోయిన బైపాస్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పనులు పూర్తయితే భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.
కోట్ పల్లి ప్రాజెక్టుకు కొత్త ఊపిరి
జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి వనరైన కోట్పల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యమంత్రి సహకారంతో రూ.90 కోట్ల నిధులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువలు ఆధునీకరించబడితే సుమారు 9,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో వేలాది మంది రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలే లక్ష్యం
రోడ్లు మాత్రమే కాదు… పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, డ్రైనేజీ, గ్రామీణ రహదారులు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
అభివృద్ధే రాజకీయంగా భావిస్తున్న నాయకత్వం
ప్రజా సమస్యల పరిష్కారాన్నే రాజకీయంగా భావిస్తూ, హామీలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో చూపిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అభివృద్ధి ఫలితాలు గ్రామాలకు చేరుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా ముందుకు
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం సహకారాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. కొనసాగుతున్న పనులు పూర్తయితే తాండూరు నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

