మతం మారితే ఎస్సీ హోదా రద్దే..
- రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ జూలై 27(ప్రజాక్షేత్రం):మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా కొనసాగదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును పునర్విమర్శించాలని దాఖలైన రివ్యూ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 2026లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ హోదా కొనసాగదని స్పష్టం చేసింది. అయితే తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల్లోకి మారినట్లయితే, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా అమలుపై ఉన్న న్యాయపరమైన స్పష్టత మరోసారి బలపడినట్లు భావిస్తున్నారు.

