నాగారం, జూలై 20(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం ప్రధాన రహదారిలో కళ్లూ కాంపౌండ్ యూ-టర్న్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రద్దీ రహదారిపై గాలులకు ఫ్లెక్సీలు ఊడిపడి రోడ్డుపై అడ్డంగా పడుతుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై పడిపోయిన ఫ్లెక్సీలు స్పష్టంగా కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్నారు.అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.